ఓ సీత కథ

Posted by నవజీవన్

అనగనగా ఓ సీత. అందమైన ఓ దీవిలో తాతయ్య, నానమ్మలతో ఆనందంగా గడుపుతున్న చిన్నారి సీత జీవితంలో అనుకోకుండా ఒక రోజు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరుగుతుంది  .. నానమ్మకు జబ్బు చేస్తే తాతయ్య ఆమెను వైద్యుడికి చూపించడానికి పట్నం ప్రయాణమవుతూ, ఇంటిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి , మూడు మేకలను, ఒక చిట్టి పడవను ఆమె దగ్గర విడిచిపెడతాడు. తాతయ్య, నానమ్మతో పట్నానికి ప్రయాణమైన సమయానికే పెద్ద గాలీ, వానతో జోరుగా వర్షం పడుతుంది.  ఏదో కీడును శంకిస్తాడు ఆ వృద్దుడు.. ఒక్క క్షణం ఆలోచించి, వారు వెళ్ళిన తరువాత, మరీ పెద్ద వర్షం వస్తే ఇంటి పక్కనున్న బోధి వృక్షాన్ని ఎక్కేయమంటాడు. సీత అలాగే అంటుంది. తాతయ్య, నానమ్మతో పట్నం వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి నిజంగానే తాతయ్య ఊహించినట్లు పెద్ద గాలి వాన వస్తుంది. పల్లె మొత్తం కొట్టుకుపోతున్న సమయంలో ఏమి చేయాలో చిన్నారి సీతకు తోచదు. అప్పుడు, తాతయ్య బోధి వృక్షం ఎక్కేయమన్న సంగతి గుర్తుకొస్తుంది.ఏమీ ఆలోచించకుండా ఎక్కేస్తుంది.   కాని ఆమె చెట్టు ఎక్కేసాక తను ఎంతో ప్రేమించే బొమ్మ మోతీని ఇంట్లొనే మర్చిపోయిన విషయం ఆమెకు గుర్తుకొస్తుంది. ఆ బొమ్మను తెచ్చుకోవడానికి మళ్ళీ కిందకు దిగుతుంది..కాని వరద ప్రవాహం ఆమెను ముంచెత్తేస్తుంది. వరద ప్రవాహంలో కొట్టుకుపొతున్న ఆమెను కిషన్ అనే పదేళ్ళ కుర్రాడు కాపాడతాడు..సీత వాళ్ళ ఇంటి వద్ద ఉన్న చిట్టి పడవ సహాయంతో వారు ఒక సురక్షిత ప్రాంతానికి చేరుకుంటారు. కిషన్ సీతకు ఎన్నో కబుర్లు చెబుతాడు. ఆ కబుర్లలో పడి సీత మోతీ విషయం మర్చిపోతుంది.

కిషన్ సీతకు తన దగ్గర దాచుకున్న మామిడిపళ్ళను ఇస్తాడు. సీతకు వాటి రుచి కొత్తగా ఉంటుంది. ఎందుకంటే, తను మొదటి సారి వాటిని తింటుంది కాబట్టి. తెల్లారాక, వరద ప్రవాహం తగ్గిపోతుంది. అయినా చిన్న చిన్న చినుకులు పడుతూ ఉంటాయి. కిషన్ పడవలో సీతను వాళ్ళ ఇంటి వద్ద దిగబెడతాడు.

ఇంటి దగ్గర తాతయ్య సీత కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అతని కళ్ళలో కన్నీటిని గమనిస్తుంది సీత. ఏమైందని దీనంగా అడుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో నానమ్మ చనిపొయిందని చెబుతాడు తాతయ్య.

నానమ్మ మృతదేహాన్ని ఖననం చేసాక, వరదల్లో  నేలమట్టమైన ఇంటిని బాగుచేసే పనిలో పడతాడు తాతయ్య. సీత తాను కూడా తాతయ్య పనికి  సహాయం చేస్తుంది.తాతా మనవరాళ్ళిద్దరూ అలా జీవనం సాగిస్తూ గడిపేస్తారు.

అయితే సీతకు మిగిలిన లోటు ఒక్కటే..

మళ్ళీ తను జీవితంలో కిషన్ ను ఎప్పుడూ చూడలేకపోయింది..

చూడగానే, ఇది చాలా సాదా సీదా కథలా ఉండొచ్చు..కాని ఇందులొ 24 గంటల్లో ఒక చిన్నారికి ఈ లోకమంతా  ఏ విధంగా కనిపించిందో ఒక్క సారి విశ్లేషిస్తే, అందులో ఎన్నో అర్థాలు కనిపిస్తాయి. ఆర్ద్రత, స్నేహం, దుఖఃం అన్నీ ఒకే చోట ఒక్క చిన్నారి  పాత్రలో చూపించడానికి రచయిత ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది కదూ!

(ప్రసిద్ధ పిల్లల రచయిత రస్కిన్ బాండ్ రాసిన "ది యాంగ్రి రెయిన్-ఆంగ్ల కథకి స్వేచ్చానువాదం ఇది)





అడుగుల సవ్వడి (కథానిక)

Posted by నవజీవన్



అడుగుల సవ్వడి (కథానిక) 

రచన: నవజీవన్

నిర్మాన్యుష్యమైన ప్రాంతం ..నిశ్శబ్దం

దట్టమైన పొదల చాటు నుండి ఏవేవో గుసగుసలు.

"మనకు ఈ పరిస్థితి వస్తుందని ఎన్నడూ నేను ఊహించలేదు. మన వలన ఎంతమంది ఉపయోగం పొందలేదు. అయినా మనల్నే అంతం చేయడానికి ఎందుకు వాళ్ళు ఇంత నీచానికి దిగాజారుతున్నారు" ఆమె కంఠం బొంగురుపోయింది.

గొంతులో నుండి మాట పెగలడమే కష్టంగా ఉంది.

"నీది అర్థం కాని ఆవేదన" అన్నాడు అతను.

"అవును! నీకు అన్ని అర్థం కాని ఆవేదనలే. ఆపసోపాలు పడుతూ, ఎండనకా వాననకా కష్టపడుతూ రక్తాన్ని చిందిస్తుంటే , కనీసం కృతజ్ఞత కూడా లేని వాళ్ళ కోసం బ్రతకడం నీకు కష్టంగా లేకపోవచ్చును గాని, నాకు నెత్తురు ఉడికిపోతుంది"

"ఇంతదాకా పరిస్థితి వస్తాదనుకోలేదు. అయినా ఎన్ని రోజులు. ఏ రోజుకైనా మన బ్రతుకులు రాలిపోవలసినదేగా. అయినా అయిన వాళ్ళ కోసం సర్వస్వాన్ని అర్పించుకోవడం కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అది వర్ణనాతీతం" అతను వేదాంతిలా మాట్లాడుతున్నాడు.

"అలాగని నిన్ను తోలుబొమ్మలా చేసి ఆడిస్తే నేను ఊరుకోలేను. అయినా నేనేమి చేయగలను.ఏమి చేయలేను అనేమో ఆ దేవుడు నన్ను నిస్సహాయురాలిని చేసాడు. ఎవరి కోసమో నువ్వు నెత్తురు ఎందుకు చిందించాలి? ఎన్నాళ్ళో కలిసున్నాము. సహజీవనం సాగించాము. కష్టాలు...నష్టాలూ పంచుకున్నాము. కాని ఇప్పుడు నన్ను ఒంటరిని చేసి నీ దారి నువ్వు చూసుకుంటే ..."

ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. వెక్కి వెక్కి ఏడుస్తుంది. అతను మౌనం వహించాడు.

"నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను. ఎవరేమనుకున్నా సరే .ఇతరుల సంగతి నాకు అనవసరం. ఇది భావోద్వేగాలను పంచుకొనే సమయం కాదు"

"నీ భావోద్వేగాలు నీకు ఉండవచ్చు. కాని నాది నీ పై ఉన్న అవాజ్యమైన ప్రేమ. ఈ లోకం పూర్తిగా చెడిపోయింది. ఈ చెడిపోయిన లోకం కోసం నువ్వు నీ ప్రాణాలనే పణంగా పెడుతున్నావు. నువ్వు ఒక విషయం గుర్తుంచుకో. చెడును ద్వేషించవలసినంతగా ద్వేషించక పొతే మంచిని ప్రేమించాల్సినంతగా ప్రేమించాలేము"

ఆమె మనోవ్యధకు గురి అయ్యిందన్న విషయాన్ని అతను గుర్తించాడు. "నా సృష్టి లోకహితం కోసం. మన ఆశయాలు సేవాభావం కలిగి ఉండాలి. అదే మనం నేర్చుకున్న నీతిశాస్త్రం. నీతి లేని నాడు జీవుడు బ్రతికినా చచ్చినట్లే కదా"

"తమ స్వార్ధం కోసం నీతిని పక్కదారులు పట్టిస్తున్న వారికి లేని నీతి నీకెందుకు ప్రియతమా! నువ్వు ఈ భూమాతకు అసలైన బిడ్డవి. నువ్వు ఎంత మందికి లోకోపకారం చేయలేదు? నువ్వు ఎంత మంది ఆపన్నులను ఆదుకోలేదు? ఎంత మందికి నువ్వు ఆధారమైనావు? అయినా నిన్నే మట్టుబెట్టడానికి పథకాలు రచిస్తున్న వారిని నువ్వు క్షమించవచ్చు గాని నేను క్షమించలేను"

ఆమె మాటలు అతన్ని కదిలించాయేమో, ఓ క్షణం కళ్ళు మూసుకున్నాడు. ఆమె అతని వైపు జాలిగా చూసింది.

"నాలా ఎందఱో ఈ ప్రపంచం కోసం జీవితాలను అర్పించుకుంటూనే ఉన్నారు. వారందరూ ఈ పుడమి తల్లి ముద్దుబిడ్దలే. కాని ఇది చాలా బాధాకరమైన విషయం. నేను అనుకున్న నా వాళ్లకు నేను అవసరమనుకుంటే నా ప్రాణాలను పణంగా పెట్టడానికి కూడా సిద్దమే. కాని వారు నాటుతున్నవి విషబీజాలు. ఆ బీజాలు మనల్ని కృంగి కృశించేలా చేస్తున్నాయి. ఎన్నాళ్ళు దేవుడా ఈ నరకయాతన అని మౌనంగానే దుఃఖాన్ని దిగమింగుకొనేలా చేస్తున్నాయి. ఇది తీరని బాధ. ఈ యాతన దారుణమైనది. ఈ బాధకు నా హృదయం ఎప్పుడో బీటలు వారింది."

ఆమె అతని కళ్ళలోని నీటిని తన వేళ్ళ తో తుడవాలనుకుంది. కాని అది అసాధ్యం!

ఆమె చేతికి  ఆమెకు తెలియకుండానే ఎప్పుడో సంకెళ్ళు పడ్డాయి.

"భగవంతుడా! ఏమిటి ఈ ఘోరం" ఆమె ఆర్తిని వినేవారు ఎవ్వరూ లేరు. "నీ మాటలు ఎవరు వింటారు ప్రియతమా! ఎవ్వరూ వినరు. మనం ఆ పరిస్థితికి చాల దూరంగా వచ్చేసాము. ఇది ఊహకందని మార్గం. ఈ మార్గం లో మనకు
అన్నీ బీటలు వారిన హృదయాలే కనిపిస్తాయి. అదిగదిగో చూసావా! ఆ కళేబరాల నగ్ననృత్యం. అదిగదిగో వినిపిస్తుందా...ఆ భయంకర సంగీతం. వద్దు! గట్టిగా చెవులు మూసుకో. నువ్వా ఘోష భరించలేవు. జీవరాశులను మట్టికరిపించే వినూత్న వారధిని అదిగో అక్కడే నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణాలకు మనల్నే పునాదులుగా వాడాలని ఆ యోచన. ఆ పునాదులలో మన ఎముకలు విరిగిపోవచ్చు. అప్పుడు నన్నే తలుచుకో నా ప్రియా! నా పై నీకున్న అవాజ్యమైన ప్రేమ గుర్తుకు వస్తుంది. నా ప్రేమ గుర్తులు నీ యెదలో స్మరణకు వస్తే నీ గాయాల బాధలు కూడా నాకు ఆనందాన్నే కలిగిస్తాయి."

అతని మాటలు ఆమెకు లీలగా వినిపిస్తున్నాయి.మైకం కమ్మినట్లు ఆమె శరీరం అటు ఇటు జోగుతుంది.

"ప్రియ!..." అతను ఒక సారి ఆమెను పిలిచాడు.ఆమె పలుకలేదు.అతను తనకు తోచిన రాగాలాపన చేసుకుంటూ నిద్రలోకి జారుకోసాగాడు.అంతలో ఒక అలజడి. వాతావరణంలో భయంకర మార్పులు.ఒక విస్ఫోటనమే సంభవించిందేమో అన్నట్లుండేది ఆ పరిస్థితి.కొన్ని వందల కరవాలాలు ఆ ప్రదేశంలో కరాళ నృత్యం చేస్తున్నాయి.

మెరుపు మారుతంలా ఒక కరవాలం వచ్చి అతని కంఠమును ఖండించింది."ప్రియతమా!" అతను అరిచేంతలోనే ఆమె కంఠము కూడా ఖండించబడింది.కొన్ని వందల శిరశ్చేదనలు జరిగాయక్కడ.

ఆ శిరశ్చేదనలు ఎవరెవరివో...


కొన్ని సంవత్సరాలు గడిచాయి.

భూమి స్వేదాన్ని చిందించసాగింది. ఆ ప్రాంతమంతా దట్టంగా పొదలతో నిండి ఉంది. కలుపు మొక్కలు చిరునవ్వుతో దర్శనమివ్వసాగాయి.

రసాయనాస్వాదనకు ముక్కుపుటలు అదరసాగాయి. అంతటా దుమ్ము, ధూళి. ఏవో అడుగులు దూరంగా వినిపిస్తున్నాయి. కాని కొన్ని భీకర శబ్దాలకు ఆ అడుగుల సవ్వళ్ళు నీరుగారిపోతున్నాయి.

కానీ ఓ సవ్వడి ఆ ప్రాంతానికి ఆవలి వైపున ఉన్న చెరువులోని అప్పుడే విరిసిన ఒక ఎర్రని కలువకు వినిపించింది.

"ప్రియతమా! విన్నావా ఆ అడుగుల సవ్వడి" ఆ కలువ అప్పుడే విరిసిన మరో కలువకు ఆ మాటను చెవిలో చెప్పింది.

కాని ఆ కలువ కళ్ళ నుండి అశ్రువులు ధారగా కారసాగాయి.

"ఏమైంది ప్రియా"

ఆ కలువ తన నేస్తం చూస్తున్న దిక్కు వైపు తేరిపారా చూసింది.

అక్కడ ఆధునిక హంగులతో తయారుచేయించిన ఒక కాగితపు గోడ కనిపించింది.

ఆ గోడ పై మూడు అక్షరాలు నిస్పష్టంగా కనిపించాయి.

ఆ పదాలను ఓ సారి పరికించి చూసి ఆ తరువాత చదివి తన నేస్తం వైపు జాలిగా చూసింది ఆ ఎర్ర కలువ.

ఆ మూడు పదాలు

"వృక్షో రక్షిత రక్షితః"

పాకుడురాళ్ళు

Posted by నవజీవన్






సినిమా వ్యవస్థలోని కథానాయికల వాస్తవ జీవన చిత్రణ రావూరి భరద్వాజ "పాకుడురాళ్ళు"

సినిమా జగత్తులోని చీకటి తెరలను బహిర్గతం చేసి తన శైలిలో రావూరి భరద్వాజ గారు రాసిన నవల "పాకుడు రాళ్ళు". ఈర్ష్య, అసూయ, ఆర్భాటం, డాబు, దర్పం, అధర్మం, అనైతిక విలువలతో కూడిన సినీ వ్యవస్థలో ఒకానొక వర్గం పై ఎక్కుపెట్టిన బాణంగా ఈ నవలను చెప్పుకోవచ్చు.

నాటకాలలో స్త్రీ కళాకారుల జీవితం తో నవలను మొదలు పెట్టిన రచయిత తరువాత పడుపు వృత్తి లోని కష్టాలను చెపుతూ, సినిమా వ్యవస్థ లో దళారుల ప్రవేశం గురించి, నిర్మాతల కష్టాల గురించి కథలో ప్రస్తావిస్తూనే "మంజరి" అనే ఒక పాత్రను సృష్టించి సినిమా ప్రపంచంలో ఎదగడానికి ఆమె ఎలాంటి దిగ్గజాలతో సన్నిహితంగా ఉంటూ తను అనుకున్న లక్ష్యాన్ని చేరిందో వివరిస్తారు.

అంగబలం, అర్థబలం లేని ఒక స్త్రీ సినిమా లోకాన్ని తన వశం చేసుకొని కొన్ని రోజులు ఆ ప్రపంచాన్నే ఏలిందంటే సామాన్యమైన విషయం కాదు. ఈ నవలలో కొన్ని విషయాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని చదువుతున్నప్పుడు అనిపించినా, తరువాత మధ్యలో అవి వాస్తవాలే కావొచ్చన్న భావన చదివేవారికి కలుగుతుంది.

"పాకుడురాళ్ళు" నవల వాస్తవిక దృక్పథంతో రాసిన నవల అయినప్పటికీ ఇందులో కూడా కొన్ని చిన్ని చిన్ని లోపాలు ఉన్నాయి. చదివేవారికి కొన్ని పాత్రల మీద సానుభూతి, అభిమానం కలిగే సమయానికి అవి మటుమాయమై పోతూ ఉంటాయి.

మొదట పడుపు వృత్తి చేసుకుంటూ జీవించిన మంజరి తరువాత నాటక రంగం వైపు వచ్చి ఒక పేరొందిన నటీమణిగా కొన్ని రోజులు వెలుగొంది తరువాత "చలపతి" అనే ఒక దళారి ప్రోద్బలం తో మద్రాసు చలన చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన తరువాత చిత్ర పరిశ్రమ లో దిగ్గజాలు అనదగ్గ "రావు గారు" "మూర్తి" అనే ప్రముఖ కథానాయకులతో సన్నిహితంగా ఉంటూ, వెంకటేశ్వర్లు, ప్రసాద్ అని పేరు గల నిర్మాతలను నామరూపాలు లేకుండా చేసి, శర్మ అని సినిమా పత్రిక విలేఖరి ద్వారా తను అనుకున్న పనులు సాధించుకుంటుంది.

 కళ్యాణి అని ప్రముఖ సినీనటి సహాయం తో రాజన్ అనే తమిళ వ్యాపారవేత్తను లొంగదీసుకొని, మెహతా అనే ఉత్తరాది కి చెందిన ఒక సినిమా ఫైనాన్షియార్ తో సంబంధం పెట్టుకుని చిత్ర సీమలో తిరుగులేని నటిగా ఎదిగి ఒకానొక సమయంలో పరిశ్రమలోని పేరొందిన నటులకే కంటగింపుగా తయారవుతుంది. కళ్యాణి, మంజరి ప్రాణ స్నేహితులవుతారు. అనుకోని సందర్భం లో కళ్యాణి దారుణ హత్యకు గురి అవుతుంది. కళ్యాణి హత్య మంజరిని క్రుంగదీస్తుంది.

చిత్రసీమ లో మంజరికి వ్యతిరేకంగా ఒక వర్గం తయారవుతుంది.వారు మంజరి మట్టుబెట్టడానికి ప్రయత్నిస్తారు. కాని ఆమె వ్యూహాల ముందు వారి ఆటలు ఏమి సాగవు. ప్రముఖ నటులు కూడా ఆమెను దూరం పెడతారు. మంజరి తనతో నటించడానికి "చంద్రం" అనే ఒక పెద్ద ప్రాముఖ్యత లేని కథానాయకునికి అవకాశం ఇస్తుంది.ఆమె అహంకారం, దర్పంతో తనకు తోచిన నిర్ణయాలు తీసుకుంటుంది. గుర్రపందాలలో కొంత ధనాన్ని కోల్పోతుంది.

బొంబాయి వెళ్లి లాలరాం అనే ఒక దళారి సహాయంతో హిందీ చలచిత్ర పరిశ్రమ లో కూడా కాలుపెట్టి అక్కడ కూడా తన స్థాయి లో చక్రం తిప్పడానికి ప్రయత్నిస్తుంది. కిషన్ అనే వ్యాపారవేత్త ప్రోద్బలం తో ఒక చిత్రం లో కూడా నటిస్తుంది. శంకర్ పిళ్ళై అనే ఒక బ్రోకర్ సహాయం తో పైరవీలు చేస్తుంది.

తరువాత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో కూడా పాల్గొని హాలివుడ్ ను సందర్శించి మార్లిన్ మన్రో, ఎలిజబెత్ టేలర్ వంటి ప్రముఖ నటీమణులను కలుసుకొని వారితో ముచ్చటిస్తుంది. జీవితం లో తనకు తిరుగేలేదని ఒకానొక సందర్భం లో విర్రవీగిన ఈ కథానాయిక ఒక వికృత చక్రం లో ఇర్రుక్కుపోత్తున్నానన్న సంగతి ని ఆలస్యంగా తెలుసుకుంటుంది. బొంబాయిలో ప్రముఖ కథానాయిక అయిన సితారని అధిగమించాలని ఒక ధ్యేయాన్ని నిర్దేశించుకుంటుంది.

ఆ ప్రయత్నం లో తన చుట్టూ చేరుతున్న ప్రమాదకరమైన వ్యక్తులను కనిపెట్టలేకపోతుంది. సక్సేనా అనే ఒక కార్పోరేట్ దళారి వలలో చిక్కుకొని, అతని మోసానికి బలయ్యి ఒక నీలి చిత్రంలో నటించే దుస్థితికి దిగజారి గత్యంతరం లేని సమయం లో ఆత్మహత్య చేసుకొని తనువు చాలిస్తుంది. ఈ విధంగా మంజరి కథ అర్ధాంతరంగా ముగుస్తుంది.

ఈ నవల సినీ వినీలాకాసం లో కొందరు పెట్టుబడిదారుల వినూత్న కేళిలో బలైపోతున్న కథానాయికల గురించి ఒక వైపు చెపుతూనే, స్వార్ధం తో తమకు తామే ఈ ఛత్రం లో ఇరుక్కుని బలైపోతున్న సినిమా నిర్మాతలను గురించి కూడా చెప్పడం జరిగింది. రచయిత సినిరంగం లోని కుట్రలను, కుతంత్రాలను యదార్ధంగా బయటపెడుతూ ఈ ప్రత్యేక వ్యవస్థలో వర్గాల మధ్య కార్చిచ్చును రగిలించే పోటీతత్వం మానవీయ కోణాన్ని ఎలా దిగాజార్చడానికి ప్రయత్నిస్తుందో చెపుతారు.

"మంజరి" పాత్ర ద్వారా రచయిత విభిన్న కోణాలను ఆవిష్కరిస్తారు. ఏమి తెలియని పాత్ర అని ఈ పాత్రను కొట్టివేయలేము. అహంకారం, అతితెలివి, అసహనం అన్ని కలబోసిన పాత్ర ఇది. ఈ నవల సినిమారంగం లో పెద్దవాళ్ళం అని చెప్పుకొనే కొందరు ఆ ప్రపంచం లో పైకొస్తున్న నటులను ఎలా తోక్కివేయడానికి ప్రయత్నిస్తారో చెపుతూనే, ఆ ప్రయత్నం లో జరిగే ప్రమాదకర సంఘటనలు ఎటువంటి పర్యవసానాలకు దారితీస్తాయో కూడా చెపుతుంది.

ఈ నవల లోని అంశాలు మారుతున్న కాలంలో ఒక విషసంస్కృతికి అడ్డం పడుతున్న సంప్రదాయానితో జాగారూపులై ఉండమని హితవు చెపుతాయి.చిత్ర జగత్తులో కృత్రిమ బంధాల కోసం అనునిత్యం ప్రాకులాడుతూ ఇదే స్వర్గం అని వెర్రితలలు వీస్తూ సినీలోకానికి దాసోహం అవుతున్న కొందరు అభాగ్యుల జీవితాలను కేంద్రబిందువుగా చేసుకొని ఒక పతనానికి కారణమవుతున్న కులీన సంస్కృతి పై గొడ్డలిపెట్టు "పాకుడురాళ్ళు"


తెలుగు కథలను చలనచిత్రాలుగా తీయడం ఎలా?

Posted by నవజీవన్

తెలుగు కథలను చలనచిత్రాలుగా తీయడం ఎలా?

కథలను చలనచిత్రాలుగా తీయడం అనే అంశం దర్శకుని యొక్క అంతర్ముఖపు తాత్వికతను బట్టి ఉంటుంది. ఎందుకంటే కథలో ఉండే కొన్ని ముఖ్యమైన అంశాలు చలనచిత్రం లో ఉండవు. కథలో వస్తువు, శిల్పం, తాత్వికత, వాస్తవికత  యొక్క అవసరం ఎంత ఉంటుందో, వాటిని దర్శకుడు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కథ చదవకుండా కథను మాత్రమే తెలుసుకొని చిత్రం తీయడం సాధ్యపడదని నా అభిప్రాయం.  కథలో పాత్రల యొక్క స్వభావం అక్షరరూపం లో ఉండి మన మెదడుకు చేరుతుంది. కాని చలనచిత్రం దృశ్యకథనం . ఇది ఒక సంఘటనను ప్రత్యక్షంగా చూపించగలగాలి.కథను యథాతధంగా చలనచిత్రంగా తీయడం లో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. అందుకే, కేవలం కథలో మూలాన్ని మాత్రమే తీసుకొని కొందరు ఆ కథకు తగ్గ మార్పులు చేసి చిత్రాలు తీస్తున్నారు. 

మూలాన్ని మాత్రమె తీసుకొని చిత్రం తీయడం వలన అసలు కథలో ఉన్న వాస్తవికతకు భంగం కలిగే అవకాశం ఉంది. చలనచిత్రాలు నేడు వాస్తవికతను ప్రతిబింబిస్తున్న అంశాలను చాలా తక్కువగా చిత్రాలలో చూపిస్తున్నాయి.

తెలుగు కథలను చలనచిత్రాలుగా తీసిన వాటిలో కొన్నింటిని ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. 

మాలపిల్ల(1938)- దర్శకత్వం: గూడవల్లి రామబ్రహ్మం (తెలుగు చలనచిత్రం)- మూలం: మాలపిల్ల -కథ: గుడిపాటి వెంకటచలం .రచన సహకారం: ఉన్నవ లక్ష్మీనారాయణ, తాపీ ధర్మారావు.

యజ్ఞం (1991)- దర్శకుడు:గుత్త రామినీడు (తెలుగు చలనచిత్రం)- మూలం:యజ్ఞం -కథ: కాళీపట్నం రామారావు .ఉత్తమ చిత్రంగా బంగారు నంది పురస్కారం పొందిన చిత్రం.

స్త్రీ (1995) -దర్శకుడు: సేతుమాధవన్ (తెలుగు చలన  చిత్రం)- మూలం: పడవప్రయాణం -కథ: పాలగుమ్మి పద్మరాజు .ఈ చిత్రానికి ఉత్తమ జాతీయ తెలుగు చలనచిత్రంగా పురస్కారం లభించింది.

ఒరు చేరు పున్చిరి (2000)- దర్శకుడు:వాసుదేవన్ నాయర్ (మలయాళం)- మూలం: మిధునం -కథ: శ్రీ రమణ (తెలుగు).ఈ చిత్రానికి ఉత్తమ జాతీయ చిత్రంగా ప్రత్యేక పురస్కారం వచ్చింది.

గ్రహణం (2004)- దర్శకుడు: ఇంద్రగంటి మోహనకృష్ణ (తెలుగు చలనచిత్రం)-మూలం: దోషగుణం- కథ: గుడిపాటి వెంకట చలం .ఈ చిత్రానికి ఉత్తమ దర్శకునిగా జాతీయ స్తాయి పురస్కారం మోహనకృష్ణకు లభించింది.

మిధునం (2012) దర్శకుడు: తనికెళ్ళ భరణి (తెలుగు చలన చిత్రం) -మూలం: మిధునం - కథ: శ్రీ రమణ 

గుండెల్లో గోదారి (2013) దర్శకుడు: కుమార్ నాగేంద్ర (తెలుగు చలనచిత్రం)- మూలం: గోదావరి కథలు .రచన: బి.వి.ఎస్.రామారావు 










కథానిక - ఆఖరి ప్రశ్న

Posted by నవజీవన్

(ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం లొ మార్చి 5 వ తేదిన ప్రసారమైన నా కథానిక )


 సూర్యాస్తమయం కావస్తుంది. దుమ్ము, ధూళి తో పర్యావరణం అంతా కాంతివిహీనంగా ఉంది. దూరాన ఏవేవో చప్పుళ్ళు వినిపిస్తున్నాయి.నిర్మానుష్యమైన ఆ ప్రాంతంలో, ఓ వృక్షం పైనున్న ఓ గూడులో లీలగా వినిపిస్తుంది ఒక అర్థం కాని వేదన. ఆ శబ్దం విని ఒకింత కలవరపడ్డాను. అయినా నిస్సహాయతతో నిట్టూరుస్తూ అలాగే నిద్రలోకి జారుకున్నాను. ఆ నిద్రలో ఎన్నెన్నో కలలు. ఆ కలల వెనుక ఎన్నెన్నో కలవరపరిచే కథలు.

         ఒకప్పుడు నాకు ఈ ప్రాంతంలో ఎందరో స్నేహితులు, సావాసగాళ్ళు ఉండేవారు. వారందరితో కేరింతలు కొడుతూ హాయిగా కాలం గడిపేవాడిని. ఈ ప్రదేశమంతా దివ్యలోకాలను తలపించే బృందావనంలా ఉండేది. నిజమైన నేస్తాలు ఇక్కడే  జత కూడేవి. అయినా ప్రతి ప్రాణికి ఒక జీవితం ఉంటుంది కదా. ఆ జీవిత గమనంలోనే విభిన్న రీతులు ఉంటాయి. నన్ను కన్న తల్లితండ్రులు నాకు కావలసిన విద్యను నేర్పారు. ఆ విద్యతోనే నాకు నేను స్వతంత్రంగా బ్రతకడం నేర్చుకున్నాను. నా సావాసగాళ్ళతో ఎన్నో ప్రదేశాలు తిరిగాను. మా మైత్రి ఎంతో ముచ్చటగా ఉండేది.

          మాలో ఏ ఒక్కరికి బాధ కలిగినా మిగతావాళ్ళం కలత చెందేవాళ్ళం. మాకు ప్రపంచంలో ప్రతి ప్రాణితో  ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఏదో ఒక సంబంధం ఉండేది. అయినా నాకు జీవితం మీద ఎన్నో సంశయాలు ఉండేవి. ఏది ఏమైనా ఒకింత మనశ్శాంతితో, ప్రశాంత చిత్తంతో నిష్కల్మషంగా బ్రతుకును గడిపితే చాలు అన్నది నా ఆకాంక్ష.

         అయినా ఒక్కప్పుడు ఈ లోకమే మాకు ఆమడ దూరం లో ఉంటున్నట్లు అనిపించేది. నేను కూడా ఈ సకల ప్రాణి కోటిలో ఒక భాగమే కనుక ఈ ప్రపంచం లో కలిసిపొవడానికే ప్రయత్నించాను.

         "ఓ నేస్తమా! అటు  చూసావా. ఆ సరస్సు లో ఆ జలచరాలు  ఎలా స్వేచ్ఛగా విహరిస్తున్నాయో. ఇటు చూడు... ప్రకృతి కాంతిలో విహంగాలు ఎలా నాట్యమాడుతున్నాయో...ఈ సుందర దృశ్యాలు నా మనస్సుకు ఎంత ఆనందాన్ని కలిగిస్తున్నాయో" అని నా నేస్తం అంటే నేనుకూడా జత కలిసి ఈ ప్రకృతిమాత ఒడిలో సేద తీరడానికి ప్రయత్నించేవాణ్ని.

          "నేస్తమా! ఈ ప్రపంచం లో మన స్థానం ఎక్కడ? మన మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. దీనికి పరిష్కారం ఏమిటి" అని ఓ నేస్తం అడిగితే ఓ క్షణం ఆలోచనలో పడేవాణ్ణి.

           ఆనందభరితమైన జీవితం లో అలజళ్ళు ఎదురైనా సర్దుకుపోయేవాణ్ణి. ఎప్పటికీ ఒక్కటే ఆలోచన. నాకు నా తల్లితండ్రులు నేర్పిన విద్యతో తినడానికి నాలుగు గింజలు సంపాదించుకోవడం. ప్రతి రోజు నా లక్ష్యం అదే. నాదే కాదు..నాతో పాటు అహర్నిశలు శ్రమిస్తున్న నాలాంటి బడుగు జీవుల లక్ష్యం కూడా అదే.

                 "మనం నిజంగానే సంతోషంగా ఉన్నామా నేస్తం" అని ఓ నేస్తం అడిగితే ఒక్క క్షణం నవ్వి ఊరుకునేవాణ్ణి. “యాంత్రికమైపోతున్న ప్రపంచంలో నా సంతోషానికి ఏమొచ్చింది ముప్పు"అన్నట్లుండేది నా మౌనమనే సమాధానం.

                     రోజులు గడుస్తున్నాయి. నాకు కుటుంబం ఏర్పడింది. నా తల్లితండ్రులు నేర్పిన విద్యను నా పిల్లలకు నేర్పాలి అన్నదే నా తాపత్రయం. అందుకే ఇదివరకు కంటే  ఒక గంట ఎక్కువ పని చేయడం మొదలుపెట్టాను. జీవితం ఎందుకు మధురమైనదో కుటుంబం ఏర్పడిన తరువాతే ప్రతి ప్రాణికి తెలుస్తుంది. నాతో  పాటు నా సావాసగాళ్ళకు కూడా కుటుంబాలు ఏర్పడ్డాయి. వారు కూడా లోకంలో తీరుతెన్నులు తెలుసుకున్నారు. ప్రకృతిలో మమేకమైపోతూ ఎవరి జీవితంలో ఆనంద క్షణాలు వారు అనుభవిస్తున్నారు.

                   కాని ముసలం అంత వేగంగా వచ్చి పడుతుందని ఎవరూహించగలరు? ఎప్పుడూ ప్రకృతిమాత  ఒడిలో హాయిగా ఆటలాడుకునే నా సావాసగాళ్ళు నిర్లిప్తతతో ఉండసాగారు. ఒక్క క్షణం వాతావరణంలో పెనుమార్పు సంభవించిందేమో అని అనిపించింది.కొందరు భయం తో పరుగెత్తసాగారు. నాకు ఏమీ అర్థం కావడం లేదు. నేను బ్రతికిన ఈ బంగారం లాంటి భూమిలో ఈ ఆక్రోశానికి కారణం ఏమిటి?

                  "పుట్టినబిడ్డలు చచ్చిపోతున్నారు నేస్తం! కారణం ఏమిటో తెలియదు. మన జాతి అంతరించిపోతున్నదేమో అన్న భయంతో ఈ ప్రాంతం వదిలి అందరూ తలో దిక్కు పయనిస్తున్నారు. ఇక నువ్వు కూడా నీ దారి చూసుకో!" ఓ నేస్తం చెప్పిన మాటలు ఇప్పటకీ  నాకు కర్ణకఠోరంగా వినిపిస్తున్నాయి.

                   నేను అడుగులో అడుగు వేసుకుంటూ ప్రదేశం అంతా పరికించి చూస్తూ వెళ్ళసాగాను. అందరూ  తమ తమ నివాసాలు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. అవి అన్ని బోసిపోయి ఉన్నాయి. కొందరు తాము మురిపెంగా కట్టుకున్న ఆవాసాలను సైతం విచారంతో నేలమట్టం చేసి మరీ వెళ్తున్నారు. నేను ఇంకొక అడుగు వేశానో లేదో భయంకరమైన ఆర్తనాదాలు, ఆక్రందనలు, ఆక్రోశాలు ఆ ప్రాంతం నిండా తాండవం చేయసాగాయి. ప్రతీ ఇంటిలో నుండి చావుకేకలు వినిపిస్తున్నాయి. నేను భయంతో నా ఇంటి వైపు వెళ్ళాను. నా కుటుంబానిదీ అదే పరిస్థితి. నా ఇద్దరు పిల్లలు కూడా చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నారు.

                 అయ్యో! ఇది ప్రకృతి కాదు. ఓ పైశాచిక శక్తి మన మీద పగ పట్టింది. వీలైనంత త్వరగా ఈ ప్రాంతం నుండి వెళ్లిపోవాలి. ఇలా అనుకున్నంత సేపు పట్టలేదు నా ఇంటి దీపాల ప్రాణాలు కూడా అనంత వాయువుల్లో కలిసిపోవడానికి!

                      ఇక మా జీవితాలకు మిగిలిందేమి లేదు. ఇదివరకున్న సావాసం ఇప్పుడు లేదు. ఇదివరకున్న నేస్తాలు ఇప్పుడు లేరు. వంశం పై పెట్టుకున్న ఆశలూ అడియాసలైనాయి. స్వర్ణ కుటీరం లాంటి మనసు నేలమట్టం అయ్యింది.

                      ఒకప్పుడు  స్వేచ్ఛావాయువులతో ఊపిరి పోసుకున్న మేము వలస జీవులమైనాము. రోదనలతో, వేదనలతో వేరే దిక్కులో జీవితం సాగించడానికి చాలా కాలం పట్టింది. అయినా పరిస్థితి లో ఎలాంటి మార్పు లేదు. మమ్మల్ని ఒక రకమైన నిస్సత్తువ ఆక్రమించింది.

                  
              "ఇది ఒక అగాధం లాంటి సమస్య. ఇక నేను జీవితమనే పరుగుపందెంలో పరుగెత్తలేను. ప్రియతమా! ఎల్లవేళలా తోడుగా నిలిచి నన్ను కాపాడిన నిన్ను విడిచి వెళ్లక తప్పదు" అని హృదయదేవత కూడా నన్ను విడిచి వెళ్ళిన సందర్భంలో ఈ భూమి అంతా ఇప్పుడే భస్మీపటలం అయితే బాగుణ్ణు అనిపించింది.తిండి గింజలతో  జీవితాలను ప్రారంభించి చిరుజీవులుగా చెలామణి అవుతూ ఆనందతీరాలలో రాగాలాపన చేస్తూ యధేఛ్ఛగా  బ్రతుకు వెళ్ళదీస్తున్న నా జాతి అంతరించపోసాగింది. కొందరు పుట్టగానే మరణించసాగారు.

            కొందరు రోగాలతో నరకయాతన పడుతూ నిస్సత్తువతో భూమికి భారమై ఈ లోకంలో బ్రతకలేక విగతజీవులయ్యారు. స్వజాతి జీవులు కనబడటమే కరువయ్యింది. నేను కూడా శక్తినంతా కూడదీసుకుని నా జాతి కోసం దిక్కు దిక్కునా గాలించసాగాను.

           ఆనాటి సావాసగాళ్ళు లేరు. ఆనందతీరాలు లేవు. ఆనాటి మధురమైన జ్ఞాపకాలు కూడా కరువైనాయి. నాకెందుకు దేవుడు చావును ప్రసాదించలేదో అర్థం కాలేదు. ఏదో నిద్ర నటిస్తూ ఒక చెట్టు మూల నక్కి ఈ లోకాన్ని గమనించసాగాను. ఇంతలో ఆవలి చెట్టు దగ్గర నాలాగే కొన ఊపిరితో ఉన్న ఓ ప్రాణి నా వైపు తేరిపార చూసి అడిగింది "నిన్ను ఎప్పుడూ ఈ ప్రాంతం లో చూడలేదే. ఎవరు నీవు"

             "జీవవైవిధ్యం లో ఈ ప్రపంచాన ఎన్నో జాతులు రోజు రోజుకి అంతరించిపోతున్నాయి. అందులో ఒక అభాగ్యున్ని నేను "అని బదులిచ్చాను. “నీ పేరు" అని అడిగింది ఆ జీవి. "పిచ్చుక" అన్నాను."మరి నీ పేరు" అని అడిగాను.

                ఆ జీవి బదులివ్వలేదు. ఓ సారి పరికించి చూసాను. ఆ జీవి ప్రాణాలు అప్పటికే అనంతవాయువుల్లో
కలిసిపోయాయి. ఇంతలో వేణుగానం లాంటి ఓ గానం మధుర స్వరాల రూపంలో ఆ  ప్రాంతంలో  తేలియాడుతున్నట్లు అనిపించింది.

             "కోకిల" గానం విని ఎన్నాళ్ళు అయ్యింది కదా అనుకున్నాను. ఆ సమయంలో  స్ఫురించింది ఇంతకు క్రితం నన్ను ప్రశ్నించిన ఆ జీవి పేరు "కోకిల" అని

             అప్పుడు అనుకున్నాను లోకంలో వినిపించని, మనం వినిపించుకోని  ఆఖరి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయని.